నరసరావుపేటలో టీడీపీ ఇన్ చార్జ్ పై వైసీపీ శ్రేణుల దాడి
సోడా సీసాలు బండ రాళ్ళతో చదలవాడ అరవిందబాబుపై దాడి
దాడిలో పది మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు
ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ పార్టీల మధ్య అగ్గిరాజుకుంటోంది. ప్రత్యక్షంగా, సోషల్ మీడియా వేదికగా అధికార వైసీపీ(YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP)నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మరీ ముఖ్యంగా పల్నాడులో ఎన్నికల ఫీవర్ తో నాయకులు పరస్పర దాడులకు తెగబడుతున్నారు. అయితే జరగబోయే ఎన్నికల్లో ప్రత్యర్ధి వల్ల ఎక్కడ ఓడిపోతామో అనే భయంతోనే ఈరకంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు, శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాకు గుండెకాయగా ఉన్న నరసరావుపేట(Narasaraopeta) నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవిందబాబు(Chadalavada Aravinda Babu)పై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, సోడా సీసాలు, బాటిల్స్ తో దాడి చేయడం కలకలం రేపింది. వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో పలువురు టీడీపీ నాయకులు గాయపడ్డారు. ప్రస్తుతం నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయపడిన టీడీపీ కార్యకర్తలు పది మంది ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
పల్నాడు జిల్లా కేంద్రంలో పొలిటికల్ ఫైట్..
నరసరావుపేటలోని స్థానిక 5వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబుపై వైసీపీ కార్యకర్తలు సోడా సీసాలు బండ రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారు పది మందికి పైగా టీడీపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ దాడి లో నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు చేతికి , వెన్నుపూస పై రాళ్ళ దెబ్బలు తగిలాయి. గాయపడిన కార్యకర్తలను పట్టణం లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై వైసిపి రౌడీ మూకల దాడిని డాక్టర్ అరవిందబాబు తీవ్రంగా ఖండించారు. తాము శాంతి యుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే వైసిపి గూడాలు సోడా సీసాలు ,బండ రాళ్ళ తో తమపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయించారనే ఆరోపణ..
స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి.శ్రీనివాస రెడ్డి ఓటమి భయం తోనే తమ పై దాడులు చేపిస్తున్నాడని, వాళ్ళు వేసిన ప్రతి రాయిని మెట్టుగా మలచుకొని తాము విజయం సాధిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియ జేశారు. 5వ వార్డులో ఎమ్మెల్యే గోపిరెడ్డి .శ్రీనివాసరెడ్డి అండదండలతో కొందరు వైసిపి నాయకులు సుమారు నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, తాము కోర్టులో కేసు వేసి దురాక్రమణకు గురైన భూమిని ప్రభుత్వానికి చెందేలా చేశామనే అక్కసుతోనే తమ పై ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తెలియజేశారు. ఈ దాడితో సంభంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి ఖఠినంగా శిక్షించాలని డాక్టర్ అరవిందబాబు ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేశారు.
ధర్నా..
పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు అరవింద్ బాబు. అనంతరం నరసరావుపేట నియోజకవర్గ పార్టీ ఆఫీస్ వద్ద నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్ళిన డా॥అరవిందబాబు తమ పార్టీ కార్యకర్తల పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట లోని అంబేద్కర్ బొమ్మ వద్ద ధర్నాకు దిగారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
నారసరాప్తెట్, గుంతూర్, ఆంధ్రప్రదేశ్
మార్చి 12, 2024 11:27 PM





















