చివరిగా నవీకరించబడింది:
కాకినాడలోని రాజా మైదానం ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులు, వాకర్స్ మెయింటెనెన్స్ లోపం, సెప్టిక్ ట్యాంకులు మూతలు లేకపోవడం, ఎంట్రన్స్ గేట్ విరిగిపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా అయినప్పటికీ.. ఆ ప్రాంతంలో క్రీడాకారులు ముఖ్యంగా వాకింగ్ కి వచ్చే ప్రజలకు ఇండోర్ స్టేడియంలో తిప్పలు తప్పడం లేదు. ఇండోర్ మెయింటెనెన్స్ కోసం క్రీడాకారులు గంటల సమయానికి స్లాట్లుగా బుక్ చేసుకుని నెలకు వేలాది రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ వాటి కనీస నిర్వహణ సరిగా లేకపోవడంతో పలువురు వాటి మెయింటెనెన్స్ పై తప్పు పడుతున్నారు. ఒక షటిల్ కోర్టు అనే కాకుండా మైదానంలో సెప్టిక్ ట్యాంకు మూత లేకపోవడం, ఎంట్రన్స్ గేట్ పూర్తిగా తుప్పు పట్టి విరిగిపోవడం.. ఇలా సమస్యల వలయంలో ఆ ఇండోర్ స్టేడియం ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కాకినాడ జిల్లాకు సంబంధించి ఇండోర్ స్టేడియం అథారిటీ అధికారుల ఆధ్వర్యంలో.. అనేక స్టేడియాలు ఉన్నాయి. దీనిలో జిల్లాలో మొట్టమొదటిది కాకినాడ కేంద్రం అయితే రెండవది రూరల్ తుని ప్రాంత రాజా మైదానం ఇండోర్ స్టేడియం. ఈ స్టేడియంలో షటిల్ కోర్టు పూర్తిగా ఇండోర్లో ఉంటుంది. ఇక్కడ గంటల చొప్పున స్లాట్స్ ను క్రీడాకారులు బుక్ చేసుకుంటారు. అయితే షటిల్ ఆడే కింద భాగం అంతా పూర్తిగా వుడ్వర్క్ తో చేయించిన పరిస్థితి ఉంది. అయితే ఆ వుడ్ అంత పూర్తిగా చిన్నాభిన్నం.. వాటి మరమ్మతులు గత ఏడాది కాలంగా చేయించని పరిస్థితి. ఇలాంటి తరుణంలో కొంతమంది క్రీడాకారులు గాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా మైదానానికి సంబంధించి రెండు సెప్టిక్ ట్యాంకులు గత కొన్నాళ్లుగా మూతలు లేకుండా ఉండటంతో మూగజీవులు.. గ్రౌండ్ కి వచ్చిన క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. క్రీడాకారులు వాటిలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అక్కడ మెయింటెనెన్స్ అధికారులకు చెప్పినప్పటికీ.. ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉందని వాకర్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా కనీసం మైదానంలో క్రీడాకారులు తప్ప, క్రీడా మైదానం మెయింటెనెన్స్ అధికారులు మాత్రం కనీసం శుభ్రం కూడా చేయించకపోవటంతో పాములు బెడద ఉందని ఆరోపిస్తున్నారు.
ఈ రాజా మైదానానికి సంబంధించి రెండు ఎంట్రన్స్ లు ఉన్నాయి.. అయితే ప్రధాన రహదారి నుంచి వచ్చే ఎంట్రన్స్ గేట్ పగటిపూట కూడా వూసివేసి ఉంటుంది. ఆ గేటు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరడం.. తుప్పు పట్టడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా అసలు గేటు ఎందుకు క్లోజ్ చేస్తున్నారని.. ప్రవ్నిస్తున్నారు. రాత్రి సమయంలో మందుబాబులు అలజడి సృష్టిస్తారన్న భయం ఉంటే.. చీకటి పడిన తర్వాత గేట్ లాక్ చేయాలి కానీ.. ఉదయం ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన గేట్ లాక్ చేయడం వలన సందులోంచి వంగి వంగి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 4:31 PM
























