గుంటూరు పల్నాడు జిల్లాలను టచ్ చేస్తూ హైదరాబాద్కు నాలుగు లైన్ల నేషనల్ హైవే
– రూ.1,064 కోట్లతో ఏపీలో శ్రీకారం

మీడియా ప్రతినిధి – విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నేషనల్ హైవేల పనులు వేగవంతం అయ్యాయి. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా మీదుగా బాపట్ల జిల్లాకు వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు 167ఏ జాతీయ రహదారి రూ.1,064.24 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఆఖరికి హైవే పూర్తి అవుతుందని భావిస్తున్నారు.
నేషనల్ హైవే 167ఏ వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ హైవే వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ళ దగ్గర నకరికల్లు అడ్డరోడ్డు వరకు నిర్మాణం కొనసాగుతోంది. బాపట్ల జిల్లాలో దాదాపు 45 కిలో మీటర్ల మేర ఈ హైవే ఉండనుంది. ఈ రోడ్డు పూర్తయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్కు త్వరగా వెళ్లొచ్చు. అలాగే తెలంగాణ వైపు నుంచి చీరాల తీర ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే రైతుల నష్ట పరిహారం అంశంపై అధికారులు స్పందించారు. భూ సేకరణ జరగగానే యజమానులకు పరిహారంపై నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. గతంలో పరిహారం ఆలస్యమైందని, కానీ కొంత కాలంగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే మూడు దఫాల్లో పరిహారం అందజేశామని, కోర్టు వివాదాలు, అగ్రిమెంట్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే తప్పకుండా అందరికీ పరిహారం అందేలా చేస్తామంటున్నారు.
























