ప్రధాని మోదీ షెడ్యూల్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్లో బస చేశారు. ఇవాళ ఉదయం 6.25కి ఆయన ఆర్కే బీచ్కి వస్తారు. 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ప్రతి రోజూ చేసినట్లే ఆయన కొన్ని యోగాసనాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మోదీ ఉదయం 11.25కి తిరిగి విశాఖ ఎయిర్ పోర్టుకి వెళ్లి.. 11.50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరతారు.
ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం:
ప్రపంచదేశాల్లో ఏటా యోగా దినోత్సవం రోజున యోగా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా జోరుగా నిర్వహించబోతున్నారు. ఇండియాలో ఈసారి ఏకంగా లక్ష కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు జరగబోతున్నాయి. బెంగళూరులో 30 దేశాలకు చెందిన 2500 మంది యోగాసనాలు వెయ్యబోతున్నారు. అన్ని రాష్ట్రాల్లో, సిటీలు, పట్టణాల్లో యోగాసనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిసారీ ఢిల్లీలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగేవి. ఈసారి కూడా అలాగే జరగబోతున్నాయి. కాకపోతే, ఈసారి వాటిలో ప్రధాని మోదీ పాల్గొనట్లేదు. బదులుగా ఆయన విశాఖలో పాల్గొంటున్నారు కాబట్టి.. ఫోకస్ మొత్తం విశాఖకు షిఫ్ట్ అయ్యింది.
విశాఖలో గిన్నీస్ రికార్డు లక్ష్యాలు:
ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధాన గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
1. అతిపెద్ద యోగా సమావేశం: 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యింది. 2023లో సూరత్లో 1,53,000 మందితో ఒక గిన్నీస్ రికార్డు ఉంది. దానిని తిరగరాయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.
2. సూర్య నమస్కారాల రికార్డు: 25,000 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేస్తారు. ఇది కూడా మరో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కానుంది.
అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా 22 ఇతర ప్రపంచ రికార్డులను సాధించేందుకు 22 విభాగాలలో యోగా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ రికార్డుల కోసం గిన్నీస్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేశారు.
ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లు:
ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ‘యోగాంధ్ర-2025’ అనే థీమ్తో నిర్వహిస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 26 కిలోమీటర్ల పొడవునా 326 యోగా ప్రాక్టీస్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. 5 లక్షల యోగా మ్యాట్లు, 5 లక్షల టీ-షర్టులను పంపిణీ చేస్తున్నారు. రవాణా కోసం 1,300 ఆర్టీసీ, 885 ప్రైవేట్ బస్సులు కలిపి మొత్తం 2,085 బస్సులు సిద్ధం చేశారు. అలాగే ఇతర వాహనాలు కూడా కలిపి మొత్తం 9,995 ఉన్నాయి. 10వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ప్రతి 100 మంది పాల్గొనేవారికి ఒక టాయిలెట్, 200 అంబులెన్స్లు, 2,000 సీసీటీవీ కెమెరాలు, ఒక్కో కిలోమీటరుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వర్షం వస్తే ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో 15,000 మంది కోసం రెయిన్ప్రూఫ్ టెంట్ సిద్ధం చేశారు.
యోగాంధ్ర-2025 కార్యక్రమం:
మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరుతో నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2.17 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు, 25 లక్షల మందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణలు, గ్రామ, వార్డు సెక్రటేరియట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. ఆంధ్రా యూనివర్సిటీ 1,400 మంది విద్యార్థులను ట్రైనర్లుగా తయారు చేసింది, వీరిలో 200 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.
విశాఖపట్నం యోగా డిక్లరేషన్:
ఈ కార్యక్రమంలో “విశాఖపట్నం యోగా డిక్లరేషన్” ప్రకటిస్తారు. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యోగా ప్రమోషన్ కట్టుబాట్లను హైలైట్ చేస్తుంది. ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్ను ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’గా మార్చే దిశగా ఒక ముందడుగుగా ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
























