చివరిగా నవీకరించబడింది:
KTR UK Tour: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు. మరి కేటీఆర్ ఎందుకు ఈ పర్యటనకు వెళ్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవర్నీ ఆహ్వానించలేదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అసలు కేటీఆర్ ఎందుకు వెళ్తున్నారో తెలుసుకుందాం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఈ సదస్సు యూరప్లో భారతదేశంపై దృష్టి సారించే అతిపెద్ద కార్యక్రమంగా ఉండబోతోది. ఈ ఏడాది ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ (Frontier Technologies for Development in India) అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామిక వేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొని, టెక్నాలజీ ద్వారా భారతదేశం సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే దానిపై చర్చించనున్నారు.
కేటీఆర్ను ఈ సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానించడానికి కారణం, తెలంగాణ రాష్ట్రంలో ఆయన చూపిన నాయకత్వం, సాంకేతికత ఆధారిత అభివృద్ధి విధానాలు. తమ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలూ.. ఇప్పుడు ఆయనకు ప్రపంచ గుర్తింపు తెస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేథీ దీనిపై స్పందించారు. “కేటీఆర్ తన అనుభవం, టెక్నాలజీ ద్వారా అభివృద్ధిని సాధించారు. ఆయన విధానాలు ఈ సదస్సులో చర్చలకు బాగా ఉపయోగపడతాయి. ఆయన పాల్గొనడం ద్వారా.. విద్యార్థులు, ప్రతినిధులకు ఉత్సాహం వస్తుంది. వారంతా భారత అభివృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారు” అని అన్నారు.
కేటీఆర్ తన ప్రసంగంలో తెలంగాణలో అమలు చేసిన వినూత్న పారిశ్రామిక విధానాలు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో టెక్నాలజీ వాడకం వంటి అంశాలపై మాట్లాడతారు. తెలంగాణలో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్లను ఏర్పాటు చేయడం, టీఎస్-ఐపాస్ విధానం ద్వారా 28,000 పారిశ్రామిక యూనిట్లకు అనుమతులు ఇవ్వడం, రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 24 లక్షల ఉద్యోగాల సృష్టి వంటి విజయాలను ఆయన ఈ సదస్సులో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణలో ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ నిర్వహణ, మొబిలిటీ వ్యాలీ స్థాపన ద్వారా ఆటోమొబైల్ రంగంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలను కూడా వివరిస్తారు.
భారతదేశం, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ, ఆర్థిక అభివృద్ధిపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన అవకాశంగా ఉంటుంది. కేటీఆర్ పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్ర వినూత్న గవర్నెన్స్ మోడల్, సుస్థిర అభివృద్ధి విధానాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.
కేటీఆర్ ఈ పర్యటనకు వెళ్లడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికర అంశమే. ప్రతిపక్ష నేతకు ఆహ్వానం రావడం అంటే.. అధికార పక్షంలో నేతలు సరిగా చేయట్లేదనేనా? ఐతే.. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 ఏళ్లు కూడా కాలేదు. అప్పుడే ఆ ప్రభుత్వ ముద్ర కనిపించదు. కానీ బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంది. అందువల్ల ఆ ప్రభుత్వం చేసిన పనులు, అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అందువల్ల కేటీఆర్కి క్రేజ్ ఉంది. కాంగ్రెస్ కూడా అలా చెయ్యగలిగితే.. ఆ పార్టీలో నేతలకూ ఇలాంటి క్రేజ్ వస్తుంది.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 19, 2025 8:34 ఆన్

























