చివరిగా నవీకరించబడింది:
మస్కట్లో అనారోగ్యంతో ఉద్యోగం కోల్పోయిన హుస్సైనమ్మను నంద్యాల జిల్లా పోలీసుల సహాయంతో 48 గంటల్లో స్వగ్రామానికి తీసుకువచ్చారు.
బ్రతుకు దెరువుకోసం మస్కట్ చేరిన మహిళకు అక్కడ అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి. ఆకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడుతూ పనిని కోల్పోయి, చివరికి భారత్కి తిరిగిరావడానికి కూడా సొమ్ము లేక నిస్సహాయంగా మారింది. ఈ పరిస్థితుల్లో నంద్యాల జిల్లా పోలీసుల చొరవతో ఆమెను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకురాగలిగారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామానికి చెందిన హుస్సైనమ్మ భర్త గతంలో అనారోగ్యంతో మరణించారు. ఆ సంఘటన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంకల్పంతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ సహాయంతో మస్కట్కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఇంట్లో వంట పనికిగాను జాబ్ పొందింది. అయితే కొద్దిరోజులకే వంట చేస్తుండగా వేడి నూనె వల్ల గాయాలు కావడంతో అనారోగ్యంగా మారింది. ఈ కారణంగా ఆమె పనికి వెళ్లలేకపోయింది. దాంతో యజమాని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు.
అనంతరం అక్కడ మరో ఉద్యోగం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజులు గడుస్తుండటంతో ఖర్చులు మితిమీరాయి. తనకు స్వదేశానికి తిరిగిరావడానికైనా డబ్బులు లేవని హుస్సైనమ్మ బాధతో సెల్ఫీ వీడియో తీసి నంద్యాల జిల్లా ఎస్పీకి పంపింది. ఈ వీడియో చూసిన ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా వెంటనే స్పందించారు. సంబంధిత ఆళ్లగడ్డ పోలీసులకు ఆమెను భారత్కు తీసుకురావాలని ఆదేశించారు.
ఈ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టి కేవలం 48 గంటల్లోనే ఆమెను క్షేమంగా స్వగ్రామానికి చేర్చగలిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మీడియాకు తెలియజేశారు. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఓ పౌరికి దేశపు వ్యవస్థ ఇలా అండగా నిలవడం ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కర్నూల్, కర్నూల్, ఆంధ్రప్రదేశ్
జూన్ 20, 2025 8:11 PM
























