ఏపీలో నియోజక వర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్
– 175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం

మీడియా ప్రతినిధి – అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణ శాసన సభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలు, శాసన సభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్-15 ప్రకారం శాసన సభ స్థానాలను ఏపీలో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది.
























