చివరిగా నవీకరించబడింది:
శ్రీశైలం దేవస్థానం భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. చక్రాల కుర్చీలు, బేబీ ఫీడింగ్ రూములు, అల్పాహార సేవలు, శుద్ధమైన నీరు, శుభ్రత, సమయపాలన వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది.
శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఇకపై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా.. ఆధ్యాత్మికతతో నిండి ఉండనుంది. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీశైలం దేవస్థానం భారీ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు నేతృత్వంలో ఇటీవల ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల అవసరాలపై చర్చించి, అన్ని విభాగాల సమన్వయంతో సేవల అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు దర్శన సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, విరాళాల కేంద్రం వద్ద చక్రాల కుర్చీలను అందుబాటులోకి తెస్తున్నారు. భవిష్యత్తులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ముందుగానే వీటిని బుక్ చేసుకునే సదుపాయాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే క్యూకాంప్లెక్సుల్లో బేబీ ఫీడింగ్ రూములను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల తల్లులు వీటిని వినియోగించుకునేలా దేవస్థానం అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభించింది.
దర్శనానికి తరలివచ్చే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో అలసట చెందకుండా నిరంతరంగా అల్పాహార సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శుద్ధమైన మంచినీరు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రతి నీటి పాయింట్ను పర్యవేక్షిస్తున్నారు. శౌచాలయాలు, చేతుల కడుక్కునే ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ మరింత కఠినంగా అమలవుతోంది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ఉదయాన్నే దర్శనానికి వచ్చిన భక్తులకు భోజనం ఆలస్యం కాకుండా సమయానికి అందించేలా అన్నప్రసాద కేంద్రాల్లో స్పష్టమైన సమయపాలనను అమలు చేస్తున్నారు. వడ్డన పకడ్బందీగా సాగేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. క్యూలైన్లలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, వెంటనే స్పందించేలా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ గేట్ల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. ఎల్లప్పుడూ ఉపయోగించగలిగే స్థితిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భక్తులే భగవంతుని ప్రతిరూపం” అనే ధ్యేయంతో శ్రీశైలం దేవస్థానం సేవల నాణ్యతను మెరుగుపరుస్తోంది. భద్రత, సౌకర్యం, ఆధ్యాత్మిక అనుభవం ఇవన్నీ కలిసేలా చర్యలు తీసుకుంటూ, భక్తులకు మరింత శాంతియుత దర్శనాన్ని అందించేందుకు శ్రీశైలం ముందడుగేస్తోంది. ఈ చర్యలన్నింటితో, శ్రీశైలం స్వామివారి దర్శనం ఇకపై భక్తుల కోసం మరింత ఆనందదాయకంగా, స్మరణీయంగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Nandyal,Kurnool,Andhra Pradesh
జూన్ 19, 2025 3:41 PM
























