చివరిగా నవీకరించబడింది:
ఎగువ మానేరు వద్ద కుండపోత వర్షాలతో వరద పెరిగి, నర్మాల వద్ద ఐదుగురు పశువుల కాపరులు చిక్కుకున్నారు. బండి సంజయ్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు వద్ద భయంకర పరిస్థితి కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా జలాశయం పూర్తిగా నిండిపోయింది. దీంతో నీటిని అధికారులు విడుదల చేయడంతో వరదప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన ఐదుగురు పశువుల కాపరులు వరదలో చిక్కుకుని ప్రాణ భయంతో అక్కడే ఆగిపోయారు. తిరుగు ప్రయాణంలో నీటి ఉద్ధృతి పెరగడంతో వారు బయటపడలేకపోయారు. వారిలో స్వామి, పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి ఉన్నారు. ఈ సంఘటన తెలియగానే స్థానిక గ్రామాల్లో కలకలం రేగింది.
ఈ వార్త తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. చిక్కుకున్న స్వామితో నేరుగా ఫోన్లో మాట్లాడుతూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తమతో ఉందని, అవసరమైన ఆహారం, సహాయం తక్షణమే అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబాలతో కూడా మంత్రి మాట్లాడి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. స్వామి కూడా ధైర్యంగా ఉన్నానని, అధికారులు రక్షిస్తారనే నమ్మకం ఉందని బండి సంజయ్కు వివరించారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గితే స్వయంగా ఘటనాస్థలంలోనే శిబిరం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చిక్కుకున్న వారికి తక్షణం ఆహారం అందించేందుకు డ్రోన్ సాయాన్ని వినియోగించారు. అదనంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపి రక్షణ చర్యలను వేగవంతం చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్టీఆర్ సిబ్బంది మొత్తం ఘటనాస్థలానికి చేరుకుని నిమిషానికోసారి పరిస్థితిని గమనిస్తున్నారు. వరదలో చిక్కుకున్న పశువుల కాపరుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై బతికే ఉన్నారన్న వార్త కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డలు, భర్తలు సురక్షితంగా తిరిగి రావాలి అంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
మరోవైపు వరద కారణంగా జిల్లా అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావం తగ్గేంతవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఒకవైపు వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తేవాలని ప్రయత్నిస్తుండగా.. మరోవైపు అధికారులు ప్రాణప్రయత్నంగా సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యం మొత్తం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితులు సురక్షితంగా ఇంటికి చేరాలని స్థానికులు ప్రార్థనలు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ఐదుగురినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
కరీంనగర్, తెలంగాణ
ఆగస్టు 27, 2025 10:39 PM
























