చివరిగా నవీకరించబడింది:
SpiceJet Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. మన దేశంలో విమానాల డొల్లతనం బయటపడుతోంది. చాలా విమానాల్లో టెక్నికల్ సమస్యలు టెన్షన్ పెడుతున్నాయి. ఈ లిస్టులో స్పైస్ జెట్ విమానం ఒకటి చేరింది.
గురువారం ఉదయం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్ ఈ సమస్యను గుర్తించారు. మరో 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు తిరిగి మళ్లించారు. ఈ ఘటనతో తిరుపతి చేరుకోవాలనుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు 10 నిమిషాల్లో తిరుపతిలో దిగిపోయే ఛాన్స్ ఉండగా.. మళ్లీ ఆ విమానాన్ని శంషాబాద్ దాకా వెనక్కి ఎందుకు తీసుకొచ్చారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారకు. ప్రత్యామ్నాయ విమాన సౌకర్యం కల్పించాలని వారు ఎయిర్లైన్ యాజమాన్యాన్ని కోరారు. అయితే, స్పైస్ జెట్ యాజమాన్యం సాంకేతిక లోపం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.
ఈ ఘటన స్పైస్ జెట్ విమానాల్లో ఇటీవల జరిగిన రెండో సాంకేతిక సమస్య. ఈ నెల 16న హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం (SG-2138)లో కాలిన వాసన రావడంతో టేకాఫ్కు ముందే విమానాన్ని నిలిపివేశారు. ఈ సమస్య వల్ల ప్రయాణికులు మూడున్నర గంటల పాటు ఎయిర్పోర్టులో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం టేకాఫ్ తర్వాత గుర్తించి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి, ముఖ్యంగా ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలతో.. ఈ టెన్షన్లు మరింత పెరిగాయి.
విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలు ప్రయాణికులకు భయం కలిగిస్తున్నాయి. అత్యవసర పనుల కోసం విమాన ప్రయాణం చేసే వారు ఈ ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇంకా మరువకముందే స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళనను మరింత రెట్టింపు చేసింది.
స్పైస్ జెట్ యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అయితే, విమాన సర్వీసుల్లో వరుస సమస్యలు తలెత్తడంతో ఎయిర్లైన్ నిర్వహణ, నిర్వహణ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా, సకాలంలో చేరుకునేలా ఎయిర్లైన్స్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 19, 2025 10:42 AM

























