పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సృజన్పై ఎనిమిది మంది తోటి విద్యార్థులు దాడి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడితో మనస్తాపానికి గురైన సృజన్ తెల్లవారుజామున తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు క్యాంపస్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సృజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు.
సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎచ్చెర్ల IIIT క్యాంపస్కు చేరుకున్నారు. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యార్థులతో మాట్లాడి వారిని ప్రశాంతపరిచే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే.వి. మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “సృజన్ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. దోషులెవరైనా వారిని వదిలిపెట్టము” అని హామీ ఇచ్చారు.
తద్వారా, పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐ అవతారం, ఎస్సై సందీప్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇక సృజన్ కుటుంబం విషయానికి వస్తే.. అతడి మరణ వార్త అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు గుంటూరు జిల్లా నుండి ఎచ్చెర్లకు చేరుకున్నారు. తమ కుమారుడు అమాయకుడని.. అతనిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తమ కొడుకు డిప్రెషన్కి మందులు తీసుకుంటున్నాడని పోలీసులు చెబుతున్నారు కానీ అతన్ని దాడి చేసిన వాళ్లే ఆ స్థితికి నెట్టేశారని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరగాలని తండ్రి వేదన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనతో కాలేజీ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కొంతసేపు విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. అయితే, పోలీసులు దర్యాప్తు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులతో చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక ఈ ఘటన వెనుక మానసిక ఒత్తిడి, విద్యా ఒత్తిడి, స్నేహితుల మధ్య వివాదం వంటి అంశాలు కూడా ఉన్నాయేమో అని పోలీసులు పరిశీలిస్తున్నారు. సృజన్ కొన్ని రోజులుగా మనస్తాపంతో ఉన్నాడని, అతను మందులు తీసుకుంటున్నాడని కూడా పోలీసు నివేదికలు పేర్కొన్నాయి.
సృజన్ వంటి ప్రతిభావంతుడైన విద్యార్థి జీవితాన్ని ఇలా ముగించుకోవడం సమాజానికి ఒక హెచ్చరిక. విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని సమయానికి గుర్తించి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు సహాయం అందించాలి. కాలేజీల్లో కౌన్సిలింగ్ సౌకర్యాలు, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Srikakulam,Andhra Pradesh
నవంబర్ 13, 2025 8:49 PM IST
























