చివరిగా నవీకరించబడింది:
CM Revanth Reddy: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో మూడు విధాలుగా పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచర్లపై ఫిర్యాదు ప్రధానితో పాటు కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామన్నారు.
CM రేవాంత్ రెడ్డి: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో మూడు విధాలుగా పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచర్లపై ప్రధానితో పాటు కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామన్నారు. సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అఖిలపక్ష ఎంపీలతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సలహాలు, సంప్రదింపులు జరిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బనకచర్లకు 2019 అక్టోబరులో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని చెప్పారు. ఇప్పుడు దీన్ని అడ్డుకునేందుకు టెక్నికల్ గా, పొలిటికల్గానే కాకుండా లీగల్గా కూడా పోరాడతామన్నారు. ఎంపీల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. రాజకీయంగా మాట్లాడుతున్నారంటూ సమావేశం నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.దీనిపై సీఎం మాట్లాడుతూ ఆయనకు ఉండే ఇబ్బంది ఆయనకు ఉంటుంది పోనివ్వండి.. వాస్తవాలు బయటకు రావడంతో ఇబ్బంది పడినట్టున్నారని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. బనకచర్ల పోలవరం అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం.
మళ్లీ జల వివాదం..
ఆంధ్రా- తెలంగాణ మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. గతంలో వైసీపీ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాల ఫలితానే నేడు కాంగ్రెస్, కూటమి ప్రభుత్వాల మధ్య ఎటూ తెగని పంచాయితీగా మారుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత దీనిపై వివరణ ఇచ్చారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే అంకురార్పణ జరిగిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ అన్నట్టు నమస్తే తెలంగాణలో రాశారని సీఎం తెలిపారు.రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృషా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఈసందర్భంగా సీఎం పేర్కొన్నారు.
అనాడే అంకురార్పణ జరిగిందట..
21-9-2016న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తుకు చేశారు సీఎం. ఏటా 3వేల టీఎంసీల నీరు వృథాగా గోదావరి నీరు సముద్రంలో కలుస్తోందని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ అన్నారు. 3వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని మొదట మాట్లాడింది కేసీఆరే. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలో ఉంది. రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు చెప్పారు. గోదావరి-బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామన్నారు. నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. గోదావరి- బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామన్నారు. తెలంగాణకు కృష్ణాలో 299 టీఎంసీలు సరిపోతాయని ఆనాడు కేసీఆర్ ఒప్పుకొని సంతకం చేశారు. ఆనాడు కేసీఆర్ చేసిన సంతకం ఇవాళ తెలంగాణకు ప్రతిబంధకంగా మారిందన్నారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్..
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మాట్లాడారని వివరణ ఇచ్చారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందని చెప్పి వాకౌట్ చేశారు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 18, 2025 8:41 PM

























