ఆర్టీసీ బస్సులో తాగుబోతును పొట్టు పొట్టు కొట్టిన యువతులు
మీడియా ప్రతినిధి – వేములవాడ: ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం సృష్టించడం కలకలం రేపింది. తాగి బస్సు ఎక్కడమే కాకుండా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతులతో గొడవకు దిగాడు.
ఎదురు తిరగటంతో అమ్మాయిలు అని కూడా చూడకుండా తన్నటం మొదలుపెట్టాడు. చివరికి యువతులు దేహశుద్ధి చేసి పంపారు.
ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు యువతుల పై అసభ్యంగా ప్రవర్తించి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాడు. వేములవాడ నుండి సిద్దిపేటకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆగినప్పుడు మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు బస్సులో ఎక్కాడు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా బస్సు నడుస్తున్న సమయంలో, యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.
యువతులు ఆ తాగుబోతును గమనించి ప్రశ్నించడంతో, సదరు తాగుబోతు వారి పై దాడికి దిగాడు. దీంతో అతడిని అక్కడికక్కడే బస్ లోనే యువతులు దేహశుద్ధి చేశారు. వెంటనే స్పందించిన బస్ డ్రైవర్, సదరు వ్యక్తిని బస్సు నుండి బలవంతంగా నేరేళ్ళ గ్రామంలో దింపివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒక ప్రయాణికుడు చిత్రీకరించడంతో వీడియో నెటింట వైరల్ అవుతుంది.
























